Dr Suneetha Reddy: అవినాశ్ రెడ్డి చిన్నపిల్లవాడా...?: సీఎం జగన్ వ్యాఖ్యలకు సునీత కౌంటర్

Suneetha counters CM Jagan remarks
  • ఇవాళ పులివెందులలో సీఎం జగన్ నామినేషన్
  • ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వివేకా హత్యోదంతంపై సీఎం వ్యాఖ్యలు
  • మీకు వివేకా అంటే ఎందుకంత ద్వేషం అంటూ ప్రశ్నించిన సునీత
  • మీ కోసం త్యాగం చేశారనా? అంటూ ఆగ్రహం

తన చిన్నాన్న వివేకా అంశంపై సీఎం జగన్ ఇవాళ పులివెందుల సభలో వ్యాఖ్యానించడం తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు. పులివెందుల నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అని, దాని వెనుక వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల శ్రమ ఉందని సునీతారెడ్డి వివరించారు. 

పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ వివేకా అందుబాటులో ఉండేవారని, పగలు రాత్రి అనే తేడా లేకుండా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారని సునీత వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకా మధ్య ఎంతో అనుబంధం ఉండేదని, వారిద్దరూ గొప్ప సమన్వయంతో పనిచేశారని వివరించారు. 

వివేకా పులివెందులలో సమితి ప్రెసిడెంట్ గా, లయన్స్ క్లబ్ గవర్నర్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా వివిధ స్థాయిల్లో పనిచేశారని సునీత తెలిపారు. 

"వివేకానందరెడ్డి గారు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి కోసం ఎంపీ పదవిని కూడా త్యాగం చేశారు. ఇంత చేశాక కూడా మీకు వివేకా అంటే ఎందుకంత అసూయ, ద్వేషం? ఆయనను చంపేంత వరకు పరిస్థితులు ఎందుకు వచ్చాయన్నది అర్థం కావడంలేదు. అనునిత్యం పులివెందుల ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి వివేకా... అందుకేనా ఆయనపై ఈర్ష్య...? 

ఇవాళ కూడా తన ప్రసంగంలో వివేకాపై నెగెటివ్ గానే మాట్లాడారు. ఆ రాత్రి చనిపోయేవరకు కూడా మీ కోసమే కృషి చేసిన వ్యక్తి గురించి మాట్లాడ్డానికి ఒక్క మంచి మాట కూడా గుర్తు రాలేదా మీకు? 

వివేకానందరెడ్డి బతికున్నప్పుడు కూడా ఆయన మనుషులను పక్కనబెట్టారు. వివేకా చనిపోయాక కూడా ఆయన మనుషులను పక్కనబెడుతున్నారు. ఆయన పోయాక కూడా ఎందుకింత ద్వేషం? ఇవాళ మీ మాటల్లో ఆయనపై ద్వేషం కనిపిస్తోంది. వివేకా మీకు ఏం పాపం చేశారు? మీ కోసం త్యాగం చేశాడు కాబట్టి అంత ద్వేషం పెంచుకున్నారా... ప్రజలకు దీనిపై మీరు సమాధానం ఇవ్వాలి. 

2019లో వివేకా చనిపోయినప్పుడు సీబీఐ విచారణ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మళ్లీ మీరే ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. ఇటీవలే మీ వాళ్లే కడప కోర్టులో గాగ్ ఆర్డర్స్ కోరుతూ కేసు పెట్టారు. మీరు కోరిన విధంగా కోర్టుతో ఆదేశాలు తెప్పించుకుంటారు... మళ్లీ మీరే వివేకా అంశంపై మాట్లాడతారు. మీకు కోర్టులంటే, పోలీసులంటే, సీబీఐ అంటే గౌరవం లేదా? వివేకాను చంపింది వీళ్లు, చంపించింది వీళ్లు అని సీబీఐ వాళ్లు చెబుతున్నారు... కానీ మీరేమో సీబీఐపై నమ్మకం లేదన్నట్టుగా అవినాశ్ రెడ్డి నిర్దోషి అని చెబుతారు. ఇక ఏ వ్యవస్థపై నమ్మకం ఉంది సార్ మీకు? 

మీరు ముఖ్యమంత్రి అయ్యాక 2019 సెప్టెంబరు 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా మీరు మాట్లాడుతూ, నా భర్త రాజశేఖర్ రెడ్డిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. కానీ ఇవాళ జగన్... వివేకాను చంపింది ఎవరో దేవుడికి తెలుసు, కడప ప్రజలందరికీ తెలుసు అంటున్నారు. అంటే మీకు తెలియదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియదా? 

మీరు ముఖ్యమంత్రిగా ఇంకా రెండు నెలల పాటు పదవిలో ఉంటారు. ఒకవేళ వివేకాను చంపింది నా భర్త రాజశేఖర్ రెడ్డి, లేక వాళ్ల అన్నయ్య శివప్రకాశ్ రెడ్డి అయితే అరెస్ట్ చేయొచ్చు కదా! ఈ దాగుడు మూతలు ఎందుకు? తప్పు చేసి ఉంటే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. 

అవినాశ్ రెడ్డి చిన్నపిల్లవాడు అంటారు... మనకు ఓ రాజ్యాంగం ఉంది... ఆ రాజ్యాంగం ప్రకారం చిన్నపిల్లలకు ఎన్నికల్లో పోటీ చేసి పదవులు పొందే అవకాశం ఇవ్వరు. ఎంపీ అంటే బాధ్యతగా ఉండాలి. ఎంపీగా పోటీ చేస్తుండడం ఇది మూడోసారి. చిన్నపిల్లవాడైతే స్కూలుకు వెళ్లాలి కానీ ఎన్నికల్లో పోటీ చేయరమ్మా! నిందితులు అని సీబీఐ చెప్పినవాళ్లను మీరెందుకు వెనకేసుకొస్తున్నారు? 

పైగా, మేం విపక్షాలతో చేయి కలిపామంటున్నారు. మీ చిన్నాన్నను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. ఐదేళ్లుగా మేం పోరాడుతుంటే ఇప్పుడు మీకు ఈ విషయంలో రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే... నిందితులు అని సీబీఐ పేర్కొన్న వాళ్లను ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకండి... వారికి ఓట్లు వేయకండి. నేను ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేది ఒక్క షర్మిలకు మాత్రమే. ఈ ఎన్నికల్లో షర్మిల గెలిస్తే వివేకానందరెడ్డి కోరిక తీరుతుంది" అంటూ డాక్టర్ సునీతారెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News