Eliza: వైసీపీలో మరో వికెట్ డౌన్... కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఎలీజా

MLA Eliza joins Congress Party
  • ఈ ఉదయం బీజేపీలో చేరిన గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్
  • ఈ మధ్యాహ్నం షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి ఎమ్మెల్యే
  • సొంత పార్టీ నేతలే కుట్ర చేశారన్న ఎలీజా
ఏపీ అధికార పక్షం వైసీపీని వీడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇవాళ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరగా, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ లో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఎలీజా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎలీజాకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

వైసీపీ టికెట్ రాని వారిలో ఎలీజా కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో చింతలపూడి నుంచి వైసీపీ అభ్యర్థిగా కంభం విజయరాజుకు అధిష్ఠానం టికెట్ కేటాయించింది. దాంతో ఎలీజా హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి చెందారు. 

ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ, సొంత పార్టీ నేతలపై తన పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని, తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశాలు పెట్టేవారని ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ కు నివేదించినా, ఆయన పట్టించుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ కావడం వల్లే ఆ పార్టీలో చేరానని ఎలీజా వెల్లడించారు. తనకు చింతలపూడి టికెట్ పై షర్మిల భరోసా ఇచ్చారని చెప్పారు.

More Telugu News

Eliza
Congress
Sharmila
Chintalapudi
YSRCP