ఉచిత విద్యుత్ పథకంపై సీఏం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
- ప్రభుత్వ పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతోందన్న హరీశ్
- కేవలం 30 లక్షల మందికి మాత్రమే పథకం వర్తింపజేశారని విమర్శ
- బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని సూచన
అలాగే వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఒకవేళ 200 యూనిట్లు దాటితే.. 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హరీశ్ రావు సూచించారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులుంటే.. ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఇక హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల మిగతా వారికి నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. అటు ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల కూడా పేద కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి ఉంటున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తుంది. ఇది కూడా సరైన పద్ధతి కాదన్నారు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని హరీశ్ రావు కోరారు. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే మాత్రం మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలని సూచించారు.