Amalapuram: అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగుదాం.. జనసేన అమలాపురం ఇన్ చార్జి

Janasena Leader Clarification On Amalapuram Ticket
  • అమలాపురం టికెట్ కేటాయింపు ప్రచారంపై సెట్టిబత్తుల రాజబాబు స్పందన
  • అత్యుత్సాహం వద్దంటూ పార్టీ కార్యకర్తలకు హితవు
  • నేడు జరగబోయే జనసేన, టీడీపీ సభను విజయవంతం చేయాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం టికెట్ తనకు కేటాయించారని జరుగుతున్న ప్రచారంపై జనసేన అమలాపురం ఇన్ చార్జి సెట్టిబత్తుల రాజబాబు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా అమలాపురం టికెట్ జనసేనకు ఇచ్చారని, ఈ టికెట్ ను రాజబాబుకు కేటాయించారని మంగళవారం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అమలాపురం జనసైనికులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ వేచి ఉండాలని రాజబాబు కార్యకర్తలకు సూచించారు.

ఈమేరకు ట్విట్టర్ లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యాక సంబరాలు చేసుకుందామని చెప్పారు. ముందే సంబరాలు చేసుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శించవద్దని జనసైనికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జరగబోయే టీడీపీ- జనసేన సభను విజయవంతం చేయడంపైనే జనసైనికులంతా దృష్టి పెట్టాలని రాజబాబు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే తెలుగు జన విజయకేతన సభకు తరలిరావాలంటూ జనసేన కార్యకర్తలు, నేతలు, టీడీపీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Amalapuram
Janasena
Party Ticket
Assembly Ticket
TDP Janasena

More Telugu News