దేశంలోనే అత్యంత పొడవైన 'అటల్ సేతు' సముద్ర వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates Atal Setu in Mumbai
  • ముంబయి, నవీ ముంబయి మధ్య వంతెన
  • అటల్ సేతుగా నామకరణం
  • బ్రిడ్జి పొడవు 21.8 కిలోమీటర్లు... సముద్రంపైనే 16.5 కిలోమీటర్ల వంతెన
  • 17,840 కోట్ల వ్యయంతో భారీ వంతెన
  • నేడు జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించారు. ముంబయిలో నిర్మించిన అత్యంత పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్టును లాంఛనంగా జాతికి అంకితం చేశారు. అనంతరం ఆ వంతెనపై కొద్దిదూరం నడిచారు. వంతెనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.

ముంబయి, నవీ ముంబయి ప్రాంతాలను కలుపుతూ సముద్రం మీదుగా సాగిపోయే ఈ వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెన సముద్రంపై 16.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వంతెన నిర్మాణంతో ముంబయి, నవీ ముంబయిల మధ్య ప్రయాణ దూరం 20 నిమిషాలకు తగ్గనుంది. 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. అటల్ సేతు నిర్మాణం 2016లో ప్రారంభమైంది. ఈ భారీ వంతెన నిర్మాణంలో పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ లో వాడిన ఇనుము కంటే 17 రెట్లు అధికంగా ఇనుమును వినియోగించారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణానికి ఉపయోగించిన కాంక్రీట్ కంటే 6 రెట్లు అధికంగా కాంక్రీట్ ను వాడారు. ఈ వంతెన కోసం రూ.17,840 కోట్లు ఖర్చు చేశారు. 

కాగా, అటల్ సేతుపై భద్రత కోసం పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఈ వంతెన పొడవునా 400 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వలస పక్షులైన ఫ్లెమింగోలకు ఇబ్బంది కలగకుండా, సౌండ్ బారియర్ టెక్నాలజీ వినియోగించారు.
Advertisement
Atal Setu
Narendra Modi
Inauguration
Mumbai
Navi Mumbai
Bridge
Maharashtra

More Telugu News