G. Kishan Reddy: కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపుపై కిషన్ రెడ్డి స్పందన
ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి... బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించిన కామారెడ్డి ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తూ రాజకీయ పోరాటం చేసి బీజేపీ జెండా పాతినందుకు కార్యకర్తలకూ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు రేపటి నుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతామని వెల్లడించారు. ఆ దిశగా కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. జనసేనతో పొత్తు వల్ల తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టిన జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది. కానీ, ఒక్క చోట కూడా గెలవలేదు.