కామారెడ్డిలో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతున్నారు: కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్

Kamareddy will not win Kamareddy says Bellaiah naik
  • కాంగ్రెస్ 85 సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా
  • ప్రజలు వన్ సైడ్‌గా కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్య
  • కేటీఆర్ సిగ్గులేకుండా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారని చురకలు
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డిలో, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ 85 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్, కేటీఆర్‌లు ఈసారి ఓడిపోతున్నారన్నారు. రెండుసార్లు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోతున్నారన్నారు. దాదాపు పది లక్షల మంది గిరిజనులు ఉన్నారని, వారికి పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ప్రజలు వన్ సైడ్‌గా కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఎంతమందికి పోడు భూములు ఇచ్చారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో 24 లక్షల మందికి పోడు భూములు ఇచ్చామన్నారు. కేసీఆర్ తప్పుడు నివేదికలతో గిరిజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు నియామకాలు పూర్తి చేయలేదని, కాని కేటీఆర్ సిగ్గులేకుండా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు.
Go Back to Shorts
Congress
KCR
KTR
Telangana Assembly Election

More Telugu News