నా భార్య తల నరుకుతామని, కొడుకులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారు: బండి సంజయ్

I received threat calls says Bandi Sanjay
  • బెదిరింపులకు కూడా భయపడకుండా పాతబస్తీలో సభను నిర్వహించామన్న సంజయ్
  • పార్టీ కోసం తెగించి ముందుకు సాగిన చరిత్ర తమదని వ్యాఖ్య
  • చంపేస్తామని రాజాసింగ్ కు కూడా బెదిరింపులు వచ్చాయని వెల్లడి
తెలంగాణ బీజేపీ అగ్రనేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చేవని ఆయన తెలిపారు. చార్మినార్ వద్ద బీజేపీ సభ పెడితే తన భార్య తలను నరికి బహుమతిగా పంపిస్తామని, కొడుకులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని చెప్పారు. అయితే బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా పాతబస్తీలో సభను నిర్వహించామని తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో బీజేపీని బలోపేతం చేయడానికి ధైర్యంగా పాతబస్తీలో సభను పెట్టామని చెప్పారు. బెదిరింపులకు భయపడకుండా చార్మినార్ ఎదుటే సభను నిర్వహించామని తెలిపారు. పార్టీ కోసం తెగించి, ధైర్యంగా ముందుకు వెళ్లిన చరిత్ర తమదని అన్నారు. 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కూడా తన మాదిరే ఎన్నో బెదిరింపులు వచ్చాయని... ఆయనను చంపేస్తామని బెదిరించారని సంజయ్ తెలిపారు. అయినా, రాజాసింగ్ భయపడకుండా హిందూ ధర్మం కోసం తన పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు. బీజేపీకి ఏడాది పాటు దూరమైనా... ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నారని కితాబునిచ్చారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. బీజేపీ గెలిస్తే బీసీ నేత సీఎం అవుతారని అన్నారు. ఇప్పటికే బీజేపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లారని... ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలను నిర్వహిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Bandi Sanjay
Raja Singh
BJP

More Telugu News