NIA: ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు..తెలుగు రాష్ట్రాల్లో కలకలం!

NIA conducts raids in civil rights activists homes in Telugu states
  • పౌరహక్కుల నేతలపై ఎన్ఐఏ దృష్టి
  • హైదరాబాద్‌లో అమరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవానీ ఇంట్లో సోదాలు
  • ఏపీ పౌరహక్కుల నేతలు ఎల్లంకి వెంకటేశ్వర్లు, డా. టీ. రాజారావు నివాసాల్లోనూ తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు నిర్వహించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న కొందరిపై ఎన్ఐఏ నిఘా పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తనిఖీలకు తెరలేపింది. హైదరాబాద్‌లోని అమరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవానీ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. విద్యానగర్‌లో అడ్వొకేట్ సురేష్ ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. 

నెల్లూరులోనూ ఎన్‌ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉస్మాన్ సాహెబ్‌పేటలోని ఏపీసీఎల్‌సీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎల్లంకి వెంకటేశ్వర్లు రెండు దశాబ్దాలుగా పౌరహక్కుల ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. టీ. రాజారావు నివాసంలో ఎన్ఐఏ బృందం సోదాలు చేపట్టింది. తెల్లవారుజామున 5 గంటలకే తనిఖీలు ప్రారంభించారు. రాజారావు ఇంటితో పాటూ ఆయన ఆసుపత్రి పరిసరాల్లో ప్రత్యేక బలగాలను భారీగా మోహరించారు.
NIA
Andhra Pradesh
Telangana

More Telugu News