కెనడా వివాదంలో భారత్ కు బాసటగా మరో దేశం
- హంతకులకు కెనడా అడ్డాగా మారిందంటూ బంగ్లాదేశ్ ఆరోపణ
- హత్య చేసిన వారు అక్కడ అద్భుతంగా బతుకుతున్నట్టు వ్యాఖ్య
- తీవ్ర ఆరోపణలు చేసిన బంగ్లా విదేశాంగ మంత్రి
కెనడా భారత్ వ్యతిరేక శక్తులకు, వేర్పాటు వాదులకు, ఉగ్రవాదులకు, నేరస్థులకు, మానవ అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్ వాదనకు మద్దతుగా శ్రీలంక కూడా నిలిచింది. ఉగ్రవాదులు కెనడాను సురక్షిత గమ్యస్థానంగా చేసుకున్నారని.. అందుకే ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాల్లేకుండా దారుణమైన ఆరోపణలు (భారత్ పై) చేసినట్టు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రే ఇటీవలే ప్రకటన చేయడం గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ సైతం కెనడాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. కెనడా వేర్పాటువాద విధానాలను ప్రశ్నించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబిర్ రెహమాన్ ను తానే హత్య చేసినట్టు ప్రకటించుకున్న నూర్ చౌదరిని అప్పగించేందుకు కెనడా నిరాకరించడమే దీనికి నేపథ్యంగా ఉంది.
‘‘హంతకులకు కెనడా కేంద్రంగా మారకూడదు. హత్య చేసిన వారు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. హత్య చేసినప్పటికీ వారు అక్కడ అందమైన జీవితం గడుపుతున్నారు. వారి బంధువులు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నారు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఆరోపించారు.