ఏపీ నుంచి తరిమేసిన లులూను.. హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభించారు: గంటా శ్రీనివాసరావు
- లులూను ఏపీకి తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్న గంటా
- విశాఖ నుంచి తరిమేసిన లులూకు తెలంగాణ స్వాగతం పలికిందని వ్యాఖ్య
- ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణాలన్నీ దెబ్బతీశారని మండిపాటు
"మీరు ఏపీలో కొత్తగా పెట్టుబడులు సాధించలేరు. అప్పటికే వచ్చిన ప్రాజెక్టులను కాపాడుకోలేరు. మీరు అధికారంలోకి వచ్చీ రాగానే మీ రివర్స్ పాలనలో 'లులూ'ను కూడా ‘రివర్స్’ బాట పట్టించారు. చంద్రబాబు నాయుడు లులూ గ్రూప్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి చాలా కృషి చేశారు. ఎన్నో సంప్రదింపులు జరిపి, నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్ ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించారు.
2018లో విశాఖలో రూ. 2000 కోట్ల పెట్టుబడితో షాపింగ్మాల్, కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేలా ఎంవోయూ చేసుకొని, శంకుస్థాపన కూడా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి 'స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం'తో విసిగిపోయిన 'లులూ' అసలు ఏపీలో పెట్టుబడులే పెట్టమని చెప్పడంతో... పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరిచి లులూకు స్వాగతం పలికాయి. మన రాష్ట్రంలో బాధ్యత లేని ఇలాంటి చర్యల వలన వ్యాపార అనుకూల వాతావరణాలన్నీ దెబ్బతిన్నాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల బాట పట్టారు. రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి... విజన్ కు ఉన్న విలువను, విధ్వంసం తెచ్చే వినాశనాన్ని తెలుసుకోండి. 2024లో మన రాష్ట్ర భవిష్యత్ ను మీ ఓటు అనే ఆయుధంతో రక్షించండి" అని గంటా చెప్పారు.