Undavalli Arun Kumar: చిరంజీవి వల్లే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్... అది సాధారణ విషయంకాదు: ఉండవల్లి

Undavalli Arun Kumar supports Chiranjeevi
షార్ట్స్‌లో చూడండి
సినిమా పరిశ్రమ పిచ్చుకేనని, కానీ చిరంజీవి మాత్రం కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి చేసిన సూచనలపై మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉండవల్లి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు. స్వయంగా మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు. అలాంటి చిరంజీవి ప్రత్యేక హోదా కోసం ఏపీ మంత్రులు పోరాటం చేయాలని సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదన్నారు.

ఏపీ కంటే తెలంగాణ ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, ఇది సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే సాధ్యమైందన్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో కంటే వైసీపీ హయాంలోనే పద్దెనిమిది శాతం అదనంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని, ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాదని మరోసారి రుజువైందన్నారు. ఇది పూర్తి కావాలంటే టీడీపీ, వైసీపీ కాకుండా మరో ప్రభుత్వం రావాలన్నారు.

మరోపక్క, రామోజీరావుపై ఉండవల్లి నిప్పులు చెరిగారు. పత్రికను, ఛానల్స్‌ను అడ్డుపెట్టుకొని ఆయన అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 'విదేశాలకు కళాంజలి కళాకృతులు' అంటూ కేంద్ర ప్రభుత్వ చర్యలను పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌పై కేసు పెట్టారన్నారు. ఈ కేసులో రామోజీపై పోరాడలేక ఏబీకే ఫైన్ కట్టి బయటపడ్డారన్నారు. డబ్బులు ఉంటేనే కోర్టులో న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టే మార్గదర్శిపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.
Go Back to Shorts
Undavalli Arun Kumar
Chiranjeevi
YS Jagan

More Telugu News