Haryana: హర్యానాలో మత ఘర్షణలపై అమెరికా స్పందన

 US calls for calm amid communal clashes in Haryana
  • హింసకు పాల్పడవద్దంటూ అన్ని వర్గాలకు అమెరికా విదేశాంగ శాఖ విజ్ఞప్తి
  • శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచన
  • హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
  • పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా సెక్షన్ 144 విధించిన ప్రభుత్వం
  • ఇంటర్నేట్ సేవలపై నిషేధం కొనసాగింపు 
హర్యానాలోని నూహ్ జిల్లాలో చెలరేగుతున్న మతఘర్షణలపై అమెరికా తాజాగా స్పందించింది. హింసకు పాల్పడవద్దంటూ అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేసింది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యు మిల్లర్ హర్యానా ఘర్షణలపై స్పందించారు. ‘‘హింసాత్మక ఘటనకు పాల్పడకుండా ఉండాలని మేము ఎప్పుడూ విజ్ఞప్తి చేస్తూనే ఉంటాం. ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరుతున్నాం. అయితే, ఈ ఘర్షణలతో అక్కడి అమెరికన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారో లేదో అనే విషయంపై మాకింకా స్పష్టతలేదు’’ అని ఆయన వెల్లడించారు. 

మరోవైపు, హింస ప్రజ్వరిల్లకుండా నిరోధించేందుకు హర్యానా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఘర్షణలు ప్రారంభమైన నూహ్ జిల్లాతో పాటూ ఫరిదాబాద్, పల్వాల్, గురుగ్రామ్‌లోని మూడు సబ్‌డివిజన్లలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. ఆగస్టు 5 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరోధించేందుకు నిషేధం అవసరమని పేర్కొంది. నూహ్‌తో పాటూ సమీపంలోని ఇతర జిల్లాల్లో ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.

Haryana
USA
Communal clashes

More Telugu News