TOURISTS: క్షేమంగా తిరిగొచ్చిన ‘ముత్యంధార’ పర్యాటకులు

TOURISTS TRAPPED IN MUTYANDARA FALLS ARE SAFE
  • జలపాతం చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా భారీ వర్షం
  • వాగు ఉప్పొంగడంతో అడవిలోనే ఆగిపోయిన టూరిస్టులు
  • 8 గంటల తర్వాత క్షేమంగా బయటకు వచ్చిన 84 మంది

తెలంగాణలోని అతిపెద్ద జలపాతం ముత్యంధారను చూసేందుకు వెళ్లి అడవిలో చిక్కుకుపోయిన పర్యాటకులు అందరూ క్షేమంగా బయటకు వచ్చారని అధికారులు తెలిపారు. సుమారు ఎనిమిది గంటల పాటు అడవిలో చిక్కుకున్న పర్యాటకులు.. మరో రూట్ లో బయటపడ్డారని వివరించారు. పర్యాటకులంతా క్షేమంగా రావడంతో వారి బంధువులతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అడవిలో నుంచి బయటపడిన టూరిస్టులను ములుగు కలెక్టర్ ఐలా త్రిపాఠీ, ఎస్పీ గౌస్ ఆలం రిసీవ్ చేసుకుని, వాహనాలు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపించారు.

వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవుల్లోని ముత్యంధార జలపాతం సందర్శించేందుకు బుధవారం మధ్యాహ్నం 84 మంది పర్యాటకులు వెళ్లారు. సాయంకాలం తిరిగి వచ్చే సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో దారిలో ఓ వాగు ఉప్పొంగింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగు దాటలేక పర్యాటకులంతా అడవిలోనే చిక్కుకుపోయారు. ఫోన్ ద్వారా వారి పరిస్థితిని తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అడవిలో చిక్కుకుపోయిన టూరిస్టుల ఆచూకీ గుర్తించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులు మరో రూట్ లో అంకన్నగూడెం చేరుకోవడంతో దాదాపు 8 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

  • Loading...

More Telugu News