AAP: కాంగ్రెస్ హామీ ఇస్తే తప్ప మేం ఈ భేటీకి రాలేం: నితీష్‌కు కేజ్రీవాల్ షాక్

AAP Threatens To Skip Opposition Meet If Congress Doesnt Assure Support Against Centres Ordinance
షార్ట్స్‌లో చూడండి
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు రచించేందుకు విపక్ష కూటమి భేటీ కావడానికి ఒకరోజు ముందు కాంగ్రెస్ పార్టీకి... ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి షాకిచ్చింది. కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కలిసి రాకపోతే రేపు పాట్నాలో జరగనున్న ప్రతిపక్షాల సమావేశానికి తాము గైర్హాజరవుతామని ఆమ్ ఆద్మీ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.

పాట్నా విపక్షాల సమావేశంలో కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే, ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం నుండి వాకౌట్ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ జరపాలని కోరుతూ పలు రాష్ట్రాల బీజేపీయేతర నేతలకు ఇప్పటికే లేఖ రాశారు. 

ఈ ఆర్డినెన్స్‌ను తీసుకురావడం ద్వారా కేంద్రం దేశ రాజధాని ఢిల్లీలో ప్రయోగాలు చేసిందని, ఇది విజయవంతమైతే, బీజేపీయేతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆర్డినెన్స్‌లను తీసుకువచ్చి, ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించిన రాష్ట్రాల అధికారాలను లాక్కుంటుందని కేజ్రీవాల్ జూన్ 20 నాటి లేఖలో పేర్కొన్నారు.

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవడానికి బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ శుక్రవారం పాట్నాలో భేటీ నిర్వహిస్తున్నారు. కేంద్రం మే 19న ఢిల్లీలో రాజ్యసభలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ బిల్లును ఎలా తప్పించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరగాలని కేజ్రీవాల్‌ డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీలో గ్రూప్-ఎ అధికారుల బదిలీ, పోస్టింగ్ కోసం అథారిటీని రూపొందించడానికి కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో, ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతును పొందేందుకు కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీల నాయకులను సంప్రదించారు. పార్లమెంటులో బిల్లును తీసుకువచ్చినప్పుడు ఓడించాలని కేజ్రీవాల్ చెబుతున్నారు.
Go Back to Shorts
AAP
Congress

More Telugu News