Odisha: ఒడిశా రైలు ప్రమాదం: 207 మంది దుర్మరణం, 900 మందికి పైగా గాయాలు!

  • ఒడిశాలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం
  • బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఓ గూడ్స్ రైలు ఢీ
  • తొలుత పట్టాలు తప్పిన బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ రైలు
  • పక్కనున్న పట్టాలపై పడ్డ బోగీలను ఢీకొన్న కొరమండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు
  • ఘటనలో 207 మంది మృతి, మరో 900 మందికి పైగా గాయాలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Odisha train accident 207 dead over 900 injured

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 207 మంది మృతి చెందగా మరో 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. బోగీల్లో అనేక మంది చిక్కుకుని ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఒక గూడ్స్ రైలు రాత్రి 7 గంటల సమయంలో ఢీకొన్న విషయం తెలిసిందే. తొలుత బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పడంతో పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఎదురుగా వస్తున్న షాలీమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టింది. ఆ తరువాత మరో గూడ్స్ రైలు కూడా వీటిని ఢీకొట్టింది. ఇలా మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కాగా, ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికార ప్రతినిధి మరో వివరణ ఇచ్చారు. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో పలు బోగీలు ఒకదానిపై మరొకటి పడ్డాయి. కొన్ని నుజ్జునుజ్జయ్యాయి. బోగీల్లో మరో 600-700 మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రాష్ట్ర, కేంద్ర సహాయక బృందాలు బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

More Telugu News