New Delhi: ఢిల్లీలో టీనేజ్ యువతి హత్య ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు!

  • మూడేళ్లుగా యువతితో నిందితుడి ప్రేమాయణం
  • ఇటీవల తమ బంధానికి ముగింపు పలకాలనుకున్న యువతి
  • ఈ విషయంలో ఇరువురి మధ్యా గొడవలు
  • కొద్ది రోజుల క్రితమే నిందితుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన యువతి
  • పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ యువకుడికి హెచ్చరిక
  • యువతి చేతిపై టాటూగా మరో వ్యక్తి పేరు
Teen Had Pointed Toy Gun At Boyfriend Days Before He Killed Her

ఢిల్లీలో టీనేజ్ యువతి దారుణ హత్యకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు కొన్ని రోజుల క్రితం యువతి ఓ బొమ్మ తుపాకీతో నిందితుడిని బెదిరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె హెచ్చరించినట్టు సమాచారం. వారిద్దరూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవల ఆమె తమ బంధానికి ముగింపు పలికేందుకు నిశ్చయించుకోవడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయట. అంతేకాకుండా, ఆమె చేతిపై మరో వ్యక్తి పేరు టాటూ కూడా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 

ఆదివారం సాహిల్(20) అనే యువకుడు నగరంలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఆమెను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. రాత్రి సమయంలో నడి వీధిలో నిందితుడు ఆమెను 20 సార్లు కత్తితో పొడిచి, ఆపై పెద్ద బండరాయితో నెత్తిమీద మోది దారుణంగా చంపేశాడు. యువతి ఆర్తనాదాలు చేస్తున్నా అక్కడున్న వారెవరూ ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదు. దీంతో, ఘటనాస్థలంలోనే ఆమె దుర్మరణం చెందింది.  

నిందితుడు ఎలక్ట్రీషియన్ అని పోలీసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తన బంధువు ఇంట్లో దాక్కున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలేంటో తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. యువతితో అతడి పరిచయం ఎలా మొదలైందనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. అతడు తన పేరు మార్చుకుని యువతికి దగ్గరయ్యాడేమో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News