Chandrababu: అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమే.. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు: చంద్రబాబు

  • సైకిల్ కు ఎలెక్ట్రిక్ హంగులు తీసుకొచ్చామన్న చంద్రబాబు
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా సైకిల్ రెడీగా ఉంటుందని వ్యాఖ్య
  • వైసీపీ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపాటు
Chandrababu speech in Mahanadu

సైకిల్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సైకిల్ కు ఎలెక్ట్రిక్ హంగులు తీసుకొచ్చామని... ఇక దూసుకుపోవడమేనని, అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమేనని చెప్పారు. జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం అందరిలో కనిపిస్తోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సైకిల్ రెడీగా ఉంటుందని చెప్పారు. సంక్షేమ పథకాలకు నాంది పలికిందే టీడీపీ అని, ఎన్టీఆర్ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ అమలు చేసిందని అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదని... 2029 నాటికి ఏపీని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు చెప్పారు. నష్టపోయిన రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో గట్టెక్కిస్తామని తెలిపారు. సైకో జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడని విమర్శించారు. ప్రజావేదికను కూల్చడంతో పాలనను ప్రారంభించిన జగన్... ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి, రివర్స్ పాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. పోలవరంను గోదావరిలో కలిపేశాడని, రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని చెప్పారు. 

తండ్రిలేని బిడ్డను అని చెప్పుకుని, కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య వంటి వాటితో జగన్ అధికారంలోకి వచ్చాడని చంద్రబాబు అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తెస్తానని చెప్పిన జగన్... కేసుల కోసం కేంద్రం ముందు తల వంచాడని ఎద్దేవా చేశారు. మద్యంపై నిషేధం విధిస్తానని చెప్పి, మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్నాడని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్ అని... రాష్ట్ర ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నారని అన్నారు. ప్రతి పేదవాడిని ధనికుడిని చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చెప్పారు.

More Telugu News