Virender Sehwag: ఐపీఎల్ ఆటగాళ్లలో సెహ్వాగ్ మెచ్చిన టాప్-5 బ్యాటర్లు వీరే..

  • రింకూ సింగ్ కు మొదటి ఓటు
  • ఐదు సిక్సర్లతో జట్టును గెలిపించడాన్ని ప్రస్తావించిన సెహ్వాగ్
  • దూబే, జైస్వాల్, సూర్యకుమార్, క్లాసెన్ కూ ఓటు
Virender Sehwag Picks Top 5 Batters In IPL 2023 Virat Kohli Shubman Gill Not In The List

మార్చి 31న ఐపీఎల్ 2023 సీజన్ మొదలైంది. అదే రోజు మొదటి ఆరంభ మ్యాచ్ లో తలపడిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. తుది ఫైనల్ మ్యాచ్ లో మరోసారి తమ శక్తి మేర విజయం కోసం పోరాడనున్నాయి. దాదాపు రెండు నెలల పాటు సాగిన పోరు ముగింపునకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ తో విజేత తేలిపోనుంది. ఈ సీజన్ లో ఎందరో ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో కొత్త వాళ్లు మెరుపులు మెరిపించారు. 

అన్ క్యాప్డ్ బ్యాటర్లు (జాతీయ జట్టుకు ఇంకా ఆడని వారు) యశస్వి జైస్వాల్, ప్రభు సిమ్రాన్ సింగ్ ఇద్దరూ సెంచరీలు నమోదు చేశారు. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ సైతం సెంచరీలతో సత్తా చాటారు. ఈ తరుణంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ నుంచి తనకు నచ్చిన టాప్-5 బ్యాటర్లు ఎవరో చెప్పాడు. 

‘‘నా వరకు ఐదుగురు క్రికెట్ పాండవులు ఎవరంటే.. మొదటి వ్యక్తి రింకూ సింగ్. కారణం ఏంటి అని మీరు అడుగుతారని అనుకోవడం లేదు. మొదటిసారి ఒక బ్యాటర్ వరుసగా ఐదు సిక్సర్లను బాది జట్టును గెలిపించడం ఇదే మొదటిసారి. అది రింకూ సింగ్ వల్లే సాధ్యపడింది. ఆ తర్వాత శివమ్ దూబే. అతడు 33 సిక్సర్లను బాదాడు. స్ట్రయిక్ రేటు 160గా ఉంది. గత కొన్ని సీజన్లలో అతడు అంత స్పష్టంగా కనిపించలేదు. కానీ, ఈ సీజన్ లో స్పష్టతతో వచ్చాడు. 

మూడోది యశస్వి జైస్వాల్. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్. చివరిగా హెన్ రిచ్ క్లాసెన్. సన్ రైజర్స్ మిడిలార్డర్ లో ఆడిన అతడు ఎక్కువ పరుగులు రాబట్టాడు. స్పిన్, పేస్ ను ఎదుర్కోగల సామర్థ్యాలు విదేశీ ఆటగాడిలో చూడడం చాలా అరుదు’’ అని సెహ్వాగ్ వివరించాడు.

More Telugu News