MS Dhoni: నేను చూసుకుంటాగా... శ్రీలంక క్రికెటర్ కుటుంబానికి భరోసా ఇచ్చిన ధోనీ

  • ఐపీఎల్ లో ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్
  • సీఎస్కే జైత్రయాత్రలో కీలకపాత్ర పోషించిన పతిరణ
  • ధోనీని కలిసిన పతిరణ కుటుంబ సభ్యులు
Dhoni assures Pathirana family members

ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో సీఎస్కే జైత్రయాత్రలో శ్రీలంక యువ పేసర్ మతీష్ పతిరణ కీలకపాత్ర పోషించాడు. మలింగాను తలపించే బౌలింగ్ యాక్షన్ తో, విపరీతమైన వేగంతో యార్కర్లు విసిరే పతిరణ... టోర్నీలో ఇప్పటివరకు కెప్టెన్ ధోనీకి నమ్మకస్తుడైన బౌలర్ గా నిలిచాడు. 

కాగా, పతిరణ కుటుంబ సభ్యులు చెన్నైలో ధోనీని కలిశారు. ధోనీకి పతిరణ తన కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. అయితే పతిరణ (20) వయసులో చిన్నవాడు కావడంతో కుటుంబాన్ని వదిలి ఇన్ని రోజులు ఐపీఎల్ కోసం భారత్ లో ఉండడం పట్ల అతడి కుటుంబ సభ్యులు ధోనీ ఎదుట ఆందోళన వెలిబుచ్చారు. 

అందుకు ధోనీ బదులిస్తూ... "మతీష గురించి మీరేం బాధపడాల్సిన పనిలేదు. అతడెప్పుడూ నాతోనే ఉంటాడు... నేను చూసుకుంటాగా..." అంటూ భరోసా ఇచ్చాడు. ఈ విషయాన్ని పతిరణ సోదరి విషూక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

"ఇప్పుడు మాకు నమ్మకం కుదిరింది, మల్లి (పతిరణ నిక్ నేమ్) గురించి మాకు భయం అక్కర్లేదు... అతడు ధోనీ సంరక్షణలో భద్రంగా ఉన్నాడు" అంటూ విషూక ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

More Telugu News