Tamilisai Soundararajan: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని.. తెలంగాణ సచివాలయ ఓపెనింగ్ తో ముడిపెడుతూ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

  • తనను తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానించలేదన్న తమిళిసై
  • ముఖ్యమంత్రి చేతుల మీదుగానే కార్యక్రమం నిర్వహించారని వెల్లడి
  • రాష్ట్రపతి మాదిరిగానే గవర్నర్లూ రాజకీయేతర వ్యక్తులే కదా అని వ్యాఖ్య
  • గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్న
rule applicable to president why not applicable to governor says tamilisai

కొత్తగా నిర్మించిన పార్లమెంటు ప్రారంభోత్సవంపై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంటును ప్రధాని ప్రారంభించడమేంటని, రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఓపెనింగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని.. తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ మాట్లాడారు. 

తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని, కానీ తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని తమిళి సై చెప్పారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రం పాలన సాగిస్తున్నది ముఖ్యమంత్రి కావడంతో ఆయన చేతుల మీదుగానే సచివాలయ ప్రారంభోత్సవం జరిగిందని చెప్పారు. 

‘‘కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ అంశం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. రాష్ట్రపతి చేత ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.

More Telugu News