Uttar Pradesh: యువకుడి కొంటె పని.. పెళ్లి క్యాన్సిల్

  • ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో చోటు చేసుకున్న ఘటన
  • పెళ్లి మండపానికి వచ్చిన ప్రేమికుడు
  • వధువు నుదుటిపై సింధూరం పెట్టడంతో ఆగిపోయిన పెళ్లి
UP man puts sindoor on woman at her wedding with another ceremony cancelled

ఉత్తరప్రదేశ్ లో ఓ కొంటె ప్రేమికుడు చేసిన పనికి పెళ్లి ఆగిపోయింది. ఘాజీపూర్ లో ఓ యువతి వివాహం జరుగుతోంది. పెళ్లి వేడుకకు అందరి మాదిరే ఓ యువకుడు కూడా వచ్చాడు. వధువు తరఫు వారు అతడ్ని గమనించలేదు. వధువు వరుడి మెడలో దండ వేయబోతోంది. ఆ సమయంలో సదరు యువకుడు మండపంపైకి వెళ్లి ఒక్కసారిగా వధువు నుదుటిపై సింధూరం దిద్దాడు. ఇది చూసి పెళ్లి కొడుకు అవాక్కయ్యాడు. చుట్టూ ఉన్న వారు సింధూరం దిద్దిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూసిన వరుడి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోయారు. 

ఈ పనిచేసిన వ్యక్తిని రామాశిష్ గా గుర్తించారు. వధువు గ్రామానికి చెందిన రామాశిష్ ఆమెను ప్రేమిస్తున్నాడు. పెళ్లి ఆగిపోవడం కోసమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తమ కుమార్తెను ఏడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని, అతడి దగ్గర వీడియోలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, అలాంటి ఆధారాలు ఏవీ పోలీసులకు లభించలేదు.

రామాశిష్ గతేడాది కూడా సంబంధిత యువతి వివాహాన్ని అడ్డుకుని తమను బెదిరించినట్టు వారు పేర్కొన్నారు. మే 16న ఈ ఘటన జరిగింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఘాజీపూర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ ప్రకటించారు. 

More Telugu News