KC venugopal: సీఎంగా సిద్ధూ.. డిప్యూటీగా డీకే.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం: కేసీ వేణుగోపాల్

  • వచ్చే పార్లమెంట్ ఎన్నికల దాకా కేపీసీసీ చీఫ్ గా శివకుమారే కొనసాగుతారన్న వేణుగోపాల్
  • కాంగ్రెస్ ఏకాభిప్రాయాన్ని నమ్ముతుందని, నియంతృత్వాన్ని కాదని వ్యాఖ్య
  • అందుకే సీఎం ఎవరనే విషయంలో వరుస సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడి
  • ఇద్దరూ సీఎం పదవికి సమర్థులైన నేతలన్న కాంగ్రెస్ నేత
KC venugopal press meet

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30కు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. గురువారం తన నివాసంలో సిద్ధరామయ్యతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వీరిద్దరితోపాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలిపారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల దాకా కర్ణాటక పీసీసీ చీఫ్ గా డీకే శివకుమారే కొనసాగుతారని తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఆయనొక్కరే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ ఏకాభిప్రాయాన్ని నమ్ముతుందని, నియంతృత్వాన్ని కాదని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం అభ్యర్థి విషయంలో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. 

సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇద్దరూ సీఎం పదవికి సమర్థులని, ఇద్దరూ తమ పార్టీ పెద్ద ఆస్తి అని చెప్పారు. కర్ణాటక ప్రజలతో అధికారాన్ని పంచుకోవడమే తమ ‘పవర్ షేరింగ్ ఫార్ములా’ అని వేణుగోపాల్ చెప్పారు. 6.5 కోట్ల కన్నడిగులకు ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

More Telugu News