MS Dhoni: కోల్ కతా స్టార్ బ్యాటర్ కు ఆటో గ్రాఫ్ ఇచ్చిన ధోనీ

  • ఆట ముగిసిన తర్వాత ధోనీని కలుసుకున్న రింకూ సింగ్
  • జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకున్న వైనం
  • నిన్నటి మ్యాచులో అర్ధ సెంచరీతో మెరిసిన కోల్ కతా యువ క్రికెటర్
MS Dhoni  jersey for Rinku Singh after KKR star batting class in Chepauk

ఏ జట్టు అయినా, ఏ ఆటగాడు అయినా ధోనీని అభిమానిస్తారనడంలో ఆశ్చర్యం లేదు. ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు వేరైనా అందరూ టీమిండియా కోసం పాటు పడేవారే. టీమిండియాకు, సీఎస్కేకు ఎన్నో విజయాలు తెచ్చి పెట్టిన క్రికెటర్ ధోనీని ఎంతో మంది యువ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటుంటారు. కోల్ కతా యువ క్రికెటర్ రింకూ సింగ్ సైతం ధోనీ అంటే తనకు ఎంత అభిమానమో ఆదివారం చాటుకున్నాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నైపై కోల్ కతా చక్కని విజయాన్ని నమోదు చేసుకుంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత రింకూ సింగ్ ధోనీని కలుసుకున్నాడు. ఆటోగ్రాఫ్ కావాలని కోరాడు. దీంతో రింకూ సింగ్ ఇచ్చిన జెర్సీపై ధోనీ తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. మ్యాచ్ ప్రదర్శనపై మాట్లాడుతూ.. ‘‘ఆరంభంలో కొన్ని వికెట్లు కోల్పోయాం. నేను బ్యాటుతో క్రీజులోకి వచ్చిన వెంటనే ‘వికెట్ కష్టంగా ఉంది. సింగిల్స్ ప్రయత్నించు. లూజ్ బంతులను అనుకూలంగా మలుచుకో’ అని నితీష్ భయ్యా చెప్పాడు. నేను దేశీ క్రికెట్ లోనూ అదే విధంగా బ్యాట్ చేస్తాను. మంచిగా తింటాను. కనుక ఎప్పుడూ శక్తి ఉంటుంది. దీని వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది’’ అని రింకూ సింగ్ వివరించాడు.

More Telugu News