Nara Lokesh: ​నల్లమల అడవుల్లో ​లోకేశ్ ను కలిసిన సేవ్ ద టైగర్ ప్రతినిధులు

  • శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం
  • వెలుగోడు అటవీప్రాంతంలో ఉత్సాహంగా లోకేశ్ పాదయాత్ర
  • తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించిన లోకేశ్
  • ఒక్క పిల్ల కాల్వ అయినా నిర్మించావా అంటూ సీఎంను ప్రశ్నించిన వైనం
Save The Tigers activists met Nara Lokesh

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 99వ రోజు శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు అటవీ ప్రాంతంలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర దారిలో లోకేశ్ కు వివిధ వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ఆదివారం సాయంత్రం వెలుగోడులో పాదయాత్రకు జనం వెల్లువెత్తారు. వెలుగోడు అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో నల్లకాల్వలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లోకేశ్ నివాళులర్పించారు. 

తెలుగు గంగ ప్రాజెక్టును సందర్శించిన లోకేశ్

రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నై ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టును నారా లోకేశ్ సందర్శించారు. పాదయాత్రలో భాగంగా వెలుగోడు చేరుకున్న లోకేశ్... ఆసియాలో అతిపెద్దదైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (తెలుగుగంగ)ను సందర్శించారు. 

దివంగత ఎన్టీఆర్, చంద్రబాబునాయుడుల ముందుచూపు, కరవుసీమపై వారికున్న ప్రేమకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెలుగోడు రిజర్వాయర్ దిగువన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి లోకేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మాది సాయపడే గుణం... మీది దోపిడీ సిద్ధాంతం!

పాదయాత్ర దారిలో తెలుగుగంగ కాల్వవద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్నవాడు శత్రువైనా ఆపన్నహస్తం అందించాలన్న సాయగుణం తెలుగుదేశం పార్టీ బ్లడ్ లోనే ఉందని అన్నారు. 

"వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి చెన్నై వరకు వెళ్లే తెలుగుగంగ ప్రధాన కాల్వ ఇది. రాష్ట్రంలో ఎడారి ప్రాంతాన్ని తలపించే రాయలసీమకు సాగునీటితోపాటు పొరుగునే ఉన్న తమిళ సోదరులకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ 1983లో తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే... చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో 1996 సెప్టెంబర్ 23న ఇక్కడ నుంచి తొలిసారిగా నీళ్లు తమిళనాడులోకి ప్రవేశించాయి. దీని ద్వారా రాయలసీమలోని 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నై ప్రజలకు తాగు నీరు అందుతోంది. 

సొంత లాభం కొంతమానుకు... పొరుగువారికి తోడ్పడవోయ్ అన్న సిద్ధాంతం మాదైతే... ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని పొరుగు రాష్ట్రానికి తరిమేసి, గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే సిద్ధాంతం జగన్ రెడ్డిది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడమే తప్ప రాయలసీమ ప్రజల కోసం ఒక్క పిల్ల కాల్వ అయినా నిర్మించావా జగన్మోహన్ రెడ్డీ" అంటూ లోకేశ్ చురకలు అంటించారు. 

 యువనేతను కలిసిన వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు

వెలుగోడు అటవీ ప్రాంతంలో పాదయాత్ర కొనసాగుతుండగా, సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు ఇండియా వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్ట్ పులిపాక బాలు యువనేత లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అటవీ ప్రాంతంలో నడుస్తూ, పులుల సంరక్షణకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

ఇమ్రాన్ సిద్దిఖీ, పులిపాక బాలు మాట్లాడుతూ సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ లో భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... అడవులను, పులులు, ఇతర వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

"అడవులు తరిగిపోవడం వలనే విపరీత వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ హయాంలో అడవుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నాం. మియావాకి మోడల్ లో ప్రతి నియోజకవర్గంలో మినీ అడవులు తయారు చేయాలని టీడీపీ హయాంలో పైలెట్ ప్రాజెక్టులు కూడా చేసాం. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. 'గిరిజన్' ఉత్పత్తులను ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. 

నాకు అడవులు, పులులు, ఇతర వన్య ప్రాణులను కాపాడటం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. ఇతర రాష్ట్రాలు, సింగపూర్ లాంటి దేశాల నేతలు ఎకో టూరిజం పట్ల ఎంతో శ్రద్ద పెట్టారు. నేను కుటుంబంతో కలిసి అనేక టైగర్ రిజర్వ్ ఎకో టూరిజం ప్రాజెక్టులు సందర్శించాను. రాష్ట్రంలో టైగర్ ఎకో టూరిజం ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి అనే ఆలోచన తోనే మీతో మాట్లాడాలని అనుకున్నాను. అడవులను, పులుల సంరక్షణ కోసం పనిచేస్తున్న మీలాంటి వారి సలహాలు తీసుకొని ప్రోటోకాల్స్ రూపొందించుకొని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం. 

సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ లో మేము భాగస్వామ్యం అవుతాం. అడవుల సంరక్షణ కోసం టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తాం. శ్రీశైలం టైగర్ రిజర్వ్ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం" అని వివరించారు.

*యువగళం వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1268.9 కి.మీ.*

*ఈరోజు నడిచింది దూరం 16.2 కి.మీ.*

*100వ రోజు (15.05.2023) పాదయాత్ర వివరాలు*

*శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)*

ఉదయం

8.00 – బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – ముత్తుకూరులో స్థానికులతో మాటామంతీ.

10.10 – పెద్దదేవలాపురంలో స్థానికులతో మాటామంతీ.

11.20 – సంతజూటూరులో స్థానికులతో మాటామంతీ.

11.40 – సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.00 – సంతజూటూరులో భోజన విరామం.

సాయంత్రం

4.00 – సంతజూటూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.15 – పరమటూరు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

6.10 – బండిఆత్మకూరులో స్థానికులతో మాటామంతీ.

5.15 – వెలిగోడు సిపి నగర్ మెయిన్ రోడ్డులో బుడగ జంగాలతో సమావేశం.

6.35 – బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News