Gautam Gambhir: హైదరాబాద్- లక్నో మ్యాచ్ లో గంభీర్ ను ఉడికించిన ఫ్యాన్స్.. వీడియోలు వైరల్

  • ఇటీవల బెంగళూరు-లక్నో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ- గంభీర్ మధ్య వివాదం
  • హైదరాబాద్ లో మ్యాచ్ సందర్భంగా గంభీర్ ను టీజ్ చేసిన అభిమానులు
  • ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ నినాదాలు.. హోరెత్తిన స్టేడియం
Targeted By Hyderabad Crowd With Virat Kohli Chants Gautam Gambhir Trends On Twitter

విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వివాదం.. ఈ ఐపీఎల్ లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. వారిద్దరి తీరుపై మాజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో యుద్ధానికే దిగారు.

అయితే 14 రోజుల కిందట జరిగిన ఈ గొడవను అభిమానులు ఇంకా మరిచిపోయినట్లు లేరు. ముఖ్యంగా కోహ్లీ అభిమానులు. నిన్న హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. లక్నో టీమ్‌ను అభిమానులు పదే పదే టీజ్ చేశారు. 

మ్యాచ్ సమయంలో మైదానంలో లక్నో మెంటార్ గంభీర్ కనిపించినప్పుడల్లా ‘కోహ్లీ.. కోహ్లీ..’’ అంటూ నినాదాలు చేశారు. నవీనుల్ హక్, గంభీర్ వచ్చినప్పుడైతే.. స్టేడియం మొత్తం హోరెత్తింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో మ్యాచ్ తర్వాత ట్విట్టర్ లో గంభీర్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు.

ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 182 పరుగుల భారీ స్కోర్ చేసినా.. నికోలస్ పూరన్ దెబ్బకు అది ఏ మాత్రమూ సరిపోలేదు. అప్పటిదాకా హైదరాబాద్ వైపు ఉన్న మ్యాచ్ ను ఒకే ఓవర్ తో తమ వైపు లాగేసుకున్నాడు. అభిషేక్ శర్మ వేసిన ఓవర్ లో రెండు సిక్సులు కొట్టి స్టోయినిస్ అవుటైతే.. ఆ తర్వాత వచ్చిన పూరన్ తాను ఆడిన మూడు బంతులను బౌండరీ అవతలికి పంపాడు. కేవలం 13 బంతుల్లోనే 44 పరుగులు చేసి.. లక్నో గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

More Telugu News