Mallikarjun Kharge: నాలుగు దశాబ్దాల్లో తొలిసారి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేదే ఆ ఘనత!

  • సొంత రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన ఖర్గే
  • పీవీకి, సోనియా గాంధీకి కూడా సాధ్యం కాని వైనం
  • 1985లో యూపీలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన రాజీవ్ గాంధీ
  • ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఖర్గే
Congress Chief Mallikarjun Kharge Done It

సొంత రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలో కూర్చోబెట్టిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘనత సాధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి సొంత రాష్ట్రంలో ఆ పార్టీ ఘన విజయం సాధించడం నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ నేతృత్వంలో 1985లో  ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 425 స్థానాలకు గాను 269 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. 

మళ్లీ ఇన్నాళ్లకు ఖర్గే తన సొంత రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాగా, ఖర్గే కాంగ్రెస్ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగ్గా హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. కర్ణాటక కాంగ్రెస్ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు వ్యూహాలను పక్కాగా అమలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకోగలిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంకతో కలిసి కర్ణాటక ఎన్నికల ప్రచార బాధ్యతలు చూసుకున్న ఖర్గే.. ప్రధాని మోదీ ప్రచారాన్ని తిప్పికొట్టగలిగారు.

పీవీ నరసింహారావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1994లో ఉమ్మడి ఏపీలో, సోనియా గాంధీ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో 2002, 2007, 2012, 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. సోనియాగాంధీ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఖర్గే తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాగలిగారు.

More Telugu News