Jagan: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలి: అధికారులతో సీఎం జగన్

  • ఏపీలో కొన్నిరోజులుగా అకాల వర్షాలు
  • అనేక ప్రాంతాల్లో పంటలు వర్షార్పణం
  • తీవ్రంగా నష్టపోయిన రైతులు
  • సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ 
CM Jagan reviews on untimely rains and consequences

ఏపీలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అధికారులు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. అకాల వర్షాలతో నష్టాలు ఎదుర్కొన్న రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదనే మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. 

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, తదనంతర పరిణామాలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం తడిసిపోయినా, రంగుమారినా సరే కొనుగోలు చేయాలని, ఇది పూర్తిస్థాయిలో జరగాలని నిర్దేశించారు. 

పంట నష్టపోయిన రైతుల వివరాలను గ్రామ సచివాలయాల నుంచి నిరంతరం తెప్పించుకుంటుండాలని సూచించారు. అదే సమయంలో, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. పరిహారం అందని వారెవరైనా మిగిలుంటే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు. 

రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదుల స్వీకరణకు ఓ టోల్ ఫ్రీ నెంబరు తీసుకురావాలని స్పష్టం చేశారు.

More Telugu News