Narendra Modi: కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ‘విష సర్పం’ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కౌంటర్

  • కాంగ్రెస్ తనను మళ్లీ నిందించడం ప్రారంభించిందన్న ప్రధాని
  • తనను తిట్టిన ప్రతిసారి ఆ పార్టీ పతనమవుతోందని వెల్లడి
  • బీజేపీపై ఎంత బురద జల్లితే.. కమలం అంత వికసిస్తుందని వ్యాఖ్య
Congress has abused me 91 times but I will continue to work for people says PM Modi in Bidar

కాంగ్రెస్ ఇప్పటికి తనను 91 సార్లు తిట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ మళ్లీ నన్ను నిందించడం ప్రారంభించింది. నన్ను నిందించిన ప్రతిసారి ఆ పార్టీ పతనమవుతోంది. తిట్టే పనిని కాంగ్రెస్ చేసుకోనివ్వండి.. నేను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పని చేస్తాను’’ అని ఆయన చెప్పారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటిస్తున్నారు. ఈ రోజు బీదర్ జిల్లాలోని హమ్నాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తనను ‘విష సర్పం’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలను ఉద్దేశించి పరోక్షంగా మోదీ వ్యాఖ్యలు చేశారు.

‘‘వాళ్లు నన్ను తిట్టారు. లింగాయత్ వర్గాన్ని నిందించారు. అంబేద్కర్, వీర్ సావర్కర్ ను కూడా అవమానించారు. వాళ్లకు ప్రజలు ఓట్లతోనే బదులిస్తారు’’ అని ప్రధాని అన్నారు. బీజేపీపై ఎంత బురద జల్లితే.. కమలం (పార్టీ గుర్తు) అంతగా వికసిస్తుందని చెప్పారు. 

కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలు.. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాదని, ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ గా చేయడానికని చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రం డబుల్ స్పీడ్ తో దూసుకుపోతుందని మోదీ తెలిపారు.

More Telugu News