Unni Mukundan: ప్రధాని మోదీని కలిసిన జనతా గారేజ్ నటుడు... అత్యుత్తమ క్షణాలు ఇవేనంటూ ఎమోషనల్

  • కేరళ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ
  • గతరాత్రి మోదీతో సమావేశమైన ఉన్నిముకుందన్
  • మోదీ సమావేశం వివరాలు ఫేస్ బుక్ లో వెల్లడి
Unni Mukundan met PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.3 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. మోదీ కేరళ వచ్చిన సందర్భంగా ఆయనను యువ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని, ఆయనతో గుజరాతీ భాషలో మాట్లాడాలన్నది ఉన్ని ముకుందన్ కోరిక. ఇన్నాళ్లకు ఆయన కోరిక నెరవేరింది. 

గత రాత్రి మోదీని కలిసి ఆయనతో ముచ్చటించారు. ప్రధాని మోదీతో గడిపిన 45 నిమిషాల సమయం తన జీవితంలో అత్యుత్తమ క్షణాలు అని ఉన్ని ముకుందన్ భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అసలు ఈ పోస్టే తన సోషల్ మీడియా ఖాతాలో జిగేల్మనిపించే పోస్టు అని అభివర్ణించారు. 

"నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను సర్... ఇన్నాళ్లకు మిమ్మల్ని కలిశాను. ఈ అనుభూతి నుంచి ఇంకా కోలుకోలేదు. మీరు గుజరాతీలో "కెం చో భాయిలా" అంటూ ప్రసంగం మొదలుపెడితే నన్ను నేను మర్చిపోతాను. మిమ్మల్ని కలిసి, మీ మాతృభాష గుజరాతీలో మీతో మాట్లాడాలన్నది నా కల. ఇప్పుడు మిమ్మల్ని కలిశాను. ఈ భేటీలో మీరు మాట్లాడిన ఏ ఒక్క మాటను కూడా మర్చిపోలేను. మీరిచ్చిన ప్రతి సలహాను కచ్చితంగా ఆచరిస్తాను" అంటూ ఉన్నిముకుందన్ పేర్కొన్నారు. 

మోదీతో తన భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా ఈ దక్షిణాది నటుడు ఫేస్ బుక్ లో పంచుకున్నారు. 35 ఏళ్ల ఉన్నిముకుందన్ తెలుగులోనూ పలు హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ, యశోద చిత్రాల్లో నటించారు.

More Telugu News