CSK: ఆ జట్టు ఈ జట్టు తేడా లేదు... బంతికి చుక్కలు చూపించారు!

  • హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం
  • 8 పరుగుల తేడాతో ఓటమిపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • మొదట 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసిన చెన్నై
  • ఉతికారేసిన కాన్వే, శివమ్ దూబే
  • లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 రన్స్ చేసిన ఆర్సీబీ
  • మెరుపుదాడి చేసిన మ్యాక్స్ వెల్, డుప్లెసిస్
  • చివర్లో వికెట్లు చేజార్చుకున్న బెంగళూరు జట్టు
CSK beat RCB by 8 runs in a batting feast

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగులు వెల్లువెత్తాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు 200కి పైగా పరుగులు సాధించడంతో ప్రేక్షకులకు సిసలైన క్రికెట్ వినోదం లభించినట్టయింది. రెండు జట్లలోని బ్యాటర్లు బంతికి చుక్కలు చూపించారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

ఓ దశలో ఆర్సీబీ గెలుపు ఈజీనే అనిపించింది. అయితే, ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయి చేజేతులా ఓడిపోయింది. కోహ్లీ మొదట్లోనే అవుటైనా, కెప్టెన్ డుప్లెసిస్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేయగా... మ్యాక్స్ వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 

డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ జోడీ క్రీజులో ఉన్నంత సేపు బంతి స్టాండ్స్ లో నాట్యం చేసింది. వీరిద్దరూ పోటాపోటీగా సిక్సర్లు బాదడంతో చెన్నై బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో 28 పరుగులు చేయగా... సుయాశ్ ప్రభుదేశాయ్ (19) పోరాడినా ఫలితం లేకపోయింది. 

చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 19 పరుగులు అవసరం కాగా... ఆ ఓవర్ విసిరిన పతిరణ ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేశాడు. పతిరణ కేవలం 10 పరుగులే ఇవ్వడంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3, మహీశ్ పతిరణ 2, ఆకాశ్ సింగ్ 1, మహీశ్ తీక్షణ 1, మొయిన్ అలీ 1 వికెట్ తీశారు.

More Telugu News