Raghu Rama Krishna Raju: 48 గంటల్లో ఇంకో అరెస్టు.. రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు

  • సీటు అవినాశ్ రెడ్డికి కన్ఫర్మ్ అని తెలిశాక కూడా ఎందుకు చంపడమని ప్రశ్నించిన రఘురామ 
  • భాస్కర్ రెడ్డి అరెస్టుతో సజ్జల రామకృష్ణారెడ్డి షాక్‌కు గురై ఉంటారని వ్యాఖ్య 
  • నిజమైన దోషులు ఎవరన్నది సునీత రెడ్డికి తెలుసని వెల్లడి
  • ఇదే పట్టుదలతో తండ్రి రుణం తీర్చుకోవాలని ఆమెకు సూచన
mp raghurama krishnamraju comments on bhashar reddy arrest

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. 48 గంటల్లో ఇంకో అరెస్ట్ ఉండే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సీబీఐ జోరు మా వైకాపా బేజారు.. హూ కిల్ బాబాయ్’’ అంటూ వ్యాఖ్యానించారు.

‘‘గొడ్డలితో హత్య చేసిన వారిని అరెస్ట్ చేశారు. హత్యకు ముందు ఎవరెవరు కలిశారో, ఎక్కడ కలిశారన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. గూగుల్ టెక్ ఔట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని స్పష్టంగా తేలిపోయింది. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు’’ అని రఘురామ అన్నారు.

‘‘వివేకాను హత్యచేసి గుండెపోటు అన్నారు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఫ్రీజర్‌లో పెట్టి రక్తం కనిపించకుండా పూలను కూడా ఏర్పాటు చేశారు’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు. భాస్కర్ రెడ్డి స్వయంగా భారతి రెడ్డికి మేనమామ అని, సీటు ఎలాగూ అవినాశ్ రెడ్డికి కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చంపడమని ప్రశ్నించారు. ఈ హత్య కేసును టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి మీదకు నెట్టివేయాలని తొలుత చూశారని చెప్పారు. కానీ వాళ్లు సీబీఐ విచారణకు అడిగారని గుర్తు చేశారు.

ఇవాళ భాస్కర్ రెడ్డి అరెస్టు కావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి షాక్‌కు గురై ఉంటారని.. ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఈ కేసుపై ఎక్కువగా మాట్లాడారని చెప్పారు. వైసీపీ నేతలు ఆదివారం ఉదయం నుంచి ఎవరు మాట్లాడటం లేదని అన్నారు.

నిజమైన దోషులు ఎవరన్నది సునీత రెడ్డికి తెలుసని రఘురామ అన్నారు. ఇదే పట్టుదలతో ముందుకు వెళ్లి తండ్రి రుణం తీర్చుకోవాలని.. ఆమె పోరాటం మహిళా లోకానికి ఆదర్శమని అన్నారు.

More Telugu News