Sasikala: పళనిస్వామి సీఎం కావడంపై శశికళ సంచలన వ్యాఖ్యలు

  • తనకు కులమత భేదాలు లేవన్న శశికళ
  • ఆహ్వానం వస్తే ఓపీఎస్ మహాసభకు వెళ్తానన్న జయ నెచ్చెలి
  • తనను అందరూ అర్థం చేసుకునే సమయం వస్తుందన్న శశికళ
VK Sasikala Responds On OPS Mahasabha

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కనుక కులాన్నే చూసి ఉంటే ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ని ముఖ్యమంత్రిని చేసి ఉండేదానిని కాదని అన్నారు. చెన్నైలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 24న తిరుచ్చిలో పన్నీర్ సెల్వం(ఓపీఎస్) నిర్వహిస్తున్న మహాసభకు వెళ్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ఇందులో దాయాల్సినది ఏముందని, ఆహ్వానం అందితే వెళ్తానని అన్నారు.

ముందైతే ఆహ్వానం రానివ్వండని అన్నారు. ఆ తర్వాత అందరికీ తనను అర్థం చేసుకునే కాలం వస్తుందని అన్నారు. అయితే, ఈ విషయాన్ని తాను పన్నీర్ సెల్వాన్ని ఉద్దేశించి చెప్పడం లేదని, అందరి గురించి చెబుతున్నానని అన్నారు. తనకు కులమత ప్రాంతీయ భేదాలు లేవని శశికళ స్పష్టం చేశారు.

More Telugu News