DK Aruna: కల్తీ కల్లు ఘటనపై అసత్యాలు మాట్లాడుతున్నారు: డీకే అరుణ

  • మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం
  • ఇద్దరి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్న అరుణ
  • వడదెబ్బతో చనిపోయారని అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం
DK Aruna reacts on adulterated toddy deaths

మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు కారణంగా ఇద్దరు మృతి చెందినట్టు వెల్లడైంది. సోమవారం ఒకరు మృతి చెందగా, నేడు మరొకరు మరణించారు. మృతులు అంజయ్య, విష్ణు అని గుర్తించారు. అంజయ్య మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు వాసి కాగా, విష్ణు అంబేద్కర్ నగర్ కు చెందినవాడు. దీనిపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. కల్తీ కల్లు ఘటనపై అసత్యాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడ్డారు. 

ఆ ఇద్దరూ కల్తీ కల్లు కారణంగానే మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. వారు చనిపోయింది కల్తీ కల్లుతో అయితే, వడదెబ్బ అని ఎందుకు అబద్ధం చెబుతారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోకి మీడియాను అనుమతించకపోవడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించారు. 

కల్తీ కల్లు ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

More Telugu News