Bihar: బీహార్ మంత్రి తేజ్‌ప్రతాప్‌కు వారణాసిలో దారుణ అవమానం!

  • మంత్రి దర్శనానికి వెళ్లిన సమయంలో లగేజీని బయట పడేసిన హోటల్ సిబ్బంది
  • ఆయన ఒక్క రోజుకు మాత్రమే రూము బుక్ చేసుకున్నారన్న ఏసీపీ
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Bihar Minister Tej Pratap Yadav Humiliated In Varanasi

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, కేబినెట్ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు వారణాసిలో దారుణ పరాభవం ఎదురైంది. అక్కడి ఓ హోటల్‌లో బస చేసిన తేజ్‌ప్రతాప్ బయటకు వెళ్లిన సమయంలో మంత్రి, ఆయన సెక్యూరిటీ సిబ్బంది లగేజీని హోటల్ నిర్వాహుకులు బయటపడేశారు. శుక్రవారం రాత్రి హోటల్ గదికి చేరుకున్న మంత్రి తమ లగేజీ రిసెప్షన్ వద్ద ఉండడం చూసి షాకయ్యారు. దీనిపై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై ఏసీపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న ఒక్క రాత్రి కోసం తేజ్‌ప్రతాప్ హోటల్ రూము బుక్ చేసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాతి రోజు ఆయన దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారని చెప్పారు. అయితే, ఏప్రిల్ 7న అదే రూమును బుక్ చేసుకున్న వ్యక్తి రావడంతో తేజ్‌ప్రతాప్ గదిలోని వస్తువులను హోటల్ సిబ్బంది రిసెప్షన్ వద్దకు మార్చారని వివరించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు మరో పోలీసు అధికారి తెలిపారు.

హోటల్‌ సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి.. తేజ్‌ప్రతాప్ గదిలోని లగేజీని హోటల్ జనరల్ మేనేజర్ తరలిస్తుండడం కనిపించిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై తేజ్ ప్రతాప్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News