సంజయ్ ను ఏ కేసులో అరెస్టు చేశారో డీజీపీకే తెలియకపోవడం సిగ్గుచేటు: కిషన్​ రెడ్డి

Union Minister Kishan Reddy expressed his displeasure at DGP
  • సంజయ్ అరెస్టుపై డీజీపీకి ఫోన్ చేసిన కేంద్ర మంత్రి
  • కేసు ఫైల్ అయిన తర్వాత వివరాలు చెబుతానని డీజీపీ
    సమాధానం ఇచ్చారన్న కిషన్ రెడ్డి
  • డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సంజయ్ ను ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేశారనే విషయాన్ని రాష్ట్ర డీజీపీ చెప్పడం లేదన్నారు. సంజయ్ అరెస్టు విషయమై డీజీపీ అంజనీకుమార్ కు కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. అయితే, కేసు వివరాలను త్వరలో చెబుతానని డీజీపీ సమాధానం ఇవ్వడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు ఫైలింగ్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీజీపీ తనకు తెలిపారని కిషన్ రెడ్డి  వివరించారు. ఓ ఎంపీని అరెస్ట్ చేసిన వివరాలు రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం సిగ్గు చేటని, పోలీసు వ్యవస్థ పనితీరుకు ఇది నిదర్శనమని అన్నారు. సరైన కారణం చెప్పకుండానే బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేస్తారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 

పలువురు మీడియా ప్రతినిధులకు పంపినట్టుగా ఆ వ్యక్తి బండి సంజయ్ కు కూడా హిందీ పేపర్ ను పంపారని కిషన్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ కు ఆ వ్యక్తి హిందీ పేపర్ వాట్సాప్ లో ఎందుకు షేర్ చేశాడో తమకు తెలియదన్నారు. వాట్సాప్ లో ఓ వ్యక్తి పేపర్ ను షేర్ చేస్తే బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతామన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇక సంజయ్ అరెస్ట్ కారణంగా ఈ నెల 8వ తేదీన హైదారాబాద్ లో జరిగే ప్రధాని మోదీ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది వుండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Go Back to Shorts
BJP
G. Kishan Reddy
Telangana
DGP
Bandi Sanjay

More Telugu News