gold smugling: విదేశాల నుంచి వచ్చేటప్పుడు బంగారం తెచ్చుకోవడంపై నిబంధనలు ఏంటంటే..!

  • విదేశాల నుంచి పురుషులు 20 గ్రాములు, మహిళలు 40 గ్రాముల లోపు ఫ్రీగా తెచ్చుకోవచ్చు
  • అంతకుమించి తీసుకొస్తే నిబంధనల ప్రకారం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి
  • అరబ్ దేశాల నుంచే ఎక్కువగా బంగారం స్మగ్లింగ్
  • వలస కార్మికులను ప్రలోభ పెడుతున్న వ్యాపారులు
Gold smugling from Arab courntries what are the rules to bring gold from other countries

బంగారం ధర మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా మన దేశంలోకి తీసుకువస్తున్నారు. అక్రమ పద్ధతులలో బంగారాన్ని తీసుకురావడాన్నే స్మగ్లింగ్ అంటారు. అంటే.. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని తీసుకువస్తే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. దీనిని ఎగ్గొట్టడానికి బంగారాన్ని దాచిపెట్టి తీసుకురావడమే స్మగ్లింగ్. ఇలా అక్రమంగా బంగారాన్ని తీసుకువచ్చే ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లోని కస్టమ్స్ అధికారులు పట్టుకుని జైలుకు పంపిస్తున్నారు. గతేడాది ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే 65.88 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి..
విదేశాల నుంచి బంగారం తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది. విదేశాల నుంచి వచ్చే వారు బంగారం తెచ్చుకోవడానికి పరిమితి అంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, నిర్దేశిత పరిమితి దాటితే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని స్పష్టం చేశారు. రూల్స్ ప్రకారం.. విదేశాల్లో ఆరు నెలల లోపు ఉండి తిరిగి వచ్చేటపుడు తమ వెంట బంగారం తీసుకొస్తే 38.5 శాతం పన్ను చెల్లించాలి. ఆరు నెలల నుంచి ఏడాది లోపు విదేశాలలో ఉన్నవారు తమ వెంట తీసుకొచ్చే బంగారంపై 13.75 శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఇలా తెచ్చుకునే బంగారం పురుషుల దగ్గర 20 గ్రాములు, మహిళల దగ్గర 40 గ్రాముల లోపు ఉంటే ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు.

స్మగ్లింగ్ ఎలా జరుగుతోంది..
అరబ్ దేశాలు దుబాయి, జోర్డాన్, కువైట్, సూడాన్ లలో బంగారం ధర తక్కువగా ఉంటుంది. దీంతో అక్కడి నుంచి అక్రమ పద్ధతులలో బంగారాన్ని తీసుకొచ్చి మన దేశంలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ఇలా కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడం ద్వారా వ్యాపారులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. కిలో బంగారంపై ఏకంగా 5 లక్షల నుంచి 7 లక్షల దాకా లాభం పొందుతున్నారు. బంగారం స్మగ్లింగ్ కోసం కొంతమంది వ్యాపారులు ప్రత్యేకంగా ముఠాలను ఏర్పాటు చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి వచ్చే వలస కార్మికులను ప్రలోభ పెట్టి, వారి ద్వారా బంగారం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని తెలిపారు. విమాన టికెట్లు, ఇతర ఖర్చులు పెట్టుకుంటామని చెప్పడంతో వలస కార్మికులు స్మగ్లింగ్ కు ఒప్పుకుంటున్నారు. కస్టమ్స్ తనిఖీలలో పట్టుబడి జైలుకు వెళుతున్నారు.

More Telugu News