Odisha: నో బాల్ ప్రకటించాడని అంపైర్ హత్య

  • ఒడిశాలోని కటక్ నగరంలో ఆదివారం షాకింగ్ ఘటన
  • క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ బంతిని నో బాల్‌గా ప్రకటించిన యువకుడు
  • ఈ చర్యపై మరో యువకుడి అభ్యంతరం, ఇద్దరి మధ్య వాగ్వాదం
  • క్షణికావేశంలో అంపైర్‌ను పొడిచి చంపిన యువకుడు
Umpire killed after declaring no ball in odisha

క్రికెట్ మ్యాచ్‌లో నో బాల్ ప్రకటించిన పాపానికి ఓ అంపైర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఒడిశాలోని కటక్ నగరంలో ఆదివారం ఈ దారుణం జరిగింది. స్థానిక యువకులు క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. మ్యాచ్‌లో 22 ఏళ్ల లక్కీ రౌత్ అంపైరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బంతిని నో బాల్‌‌గా ప్రకటించాడు. దీంతో, స్మృతి రంజన్ అనే యువకుడు లక్కీతో వాగ్వాదానికి దిగాడు. చూస్తుండగానే ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.
 
ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన రంజన్ లక్కీపై కత్తితో దాడి చేశాడు. అయితే.. అక్కడున్న వారు రంజన్‌‌ను అదుపు చేసి పోలీసులకు అప్పగించారు. మరోవైపు..లక్కీని ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన స్థానికంగా కలకం రేపుతోంది.

More Telugu News