Jana Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై జానారెడ్డి కీలక వ్యాఖ్యలు

  • బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామన్న జానారెడ్డి 
  • పొత్తులపై ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్య
  • బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపు
senior congress leader jana reddy interesting comments on alliance with brs

ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. తన కొడుకు వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఈరోజు ప్రెస్‌మీట్‌లు నిర్వహించారు. అందులో భాగంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై పోరుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ‘‘మోదీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి’’ అని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తోందని, కేంద్ర నియంతృత్వ ధోరణిని ప్రజలకు వివరిస్తామని జానారెడ్డి తెలిపారు. కేంద్రం తీరుపై 17 ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఐక్యతగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచినట్లు చెప్పారు. రాహుల్ కేసులు పెడితే బీజేపీ వాళ్లంతా జైల్లో ఉంటారని హెచ్చరించారు. పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై రాహుల్ గాంధీ మాట్లాడకుండా చేసేందుకే అనర్హత వేటు వేశారన్నారు.

More Telugu News