Sri Lanka: భారత్ లో జరిగే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించలేక చతికిలపడిన శ్రీలంక

  • ఈ ఏడాది అక్టోబరులో భారత్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం
  • టోర్నీలో 8వ స్థానం కోసం గట్టి పోటీ
  • కివీస్ తో 0-2తో వన్డే సిరీస్ ఓడిపోయిన లంక
  • జూన్ లో ఐసీపీ క్వాలిఫయర్ టోర్నీలో ఆడాల్సిన పరిస్థితి
Sri Lanka fails to get direct qualification for CWC2023

ఒకప్పుడు వన్డేల్లో వరల్డ్ చాంపియన్ గా నిలిచిన శ్రీలంక జట్టు ఇప్పుడు వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు అర్హత మ్యాచ్ ల్లో పసికూన జట్లతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబరులో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయితే, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో 0-2తో ఓటమిపాలైన శ్రీలంక జట్టు వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమైంది. 

ఇవాళ జరిగిన మూడో వన్డేలో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో కివీస్ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో వరల్డ్ కప్-2023లో 8వ బెర్తును ఖరారు చేసుకునే అవకాశాలను లంక జట్టు కోల్పోయింది. ఈ సిరీస్ గెలిచి ఉంటే శ్రీలంక జట్టు వెస్టిండీస్ ను వెనక్కి నెట్టి వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించి ఉండేది. ఈ ఓటమి నేపథ్యంలో, జూన్ లో జింబాబ్వేలో జరిగే ఐసీసీ అర్హత టోర్నీలో చిన్న జట్లతో తలపడాల్సి ఉంటుంది. 

1996లో అర్జున రణతుంగ నాయకత్వంలోని శ్రీలంక జట్టు అద్భుత విజయాలతో వరల్డ్ కప్ ను కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల కాలంలో లంక జట్టు ఆటతీరు అధ్వానంగా మారింది. అడపాదడపా మెరుగైన ఆటతీరు కనబరుస్తున్నప్పటికీ నిలకడ లోపించింది. క్రికెట్ బోర్డులో లుకలుకలు, రాజకీయాలు, స్టార్ ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోకపోవడం వంటి సమస్యలతో శ్రీలంక క్రికెట్ సతమతమవుతోంది.

More Telugu News