చంద్రబాబూ.. మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంది.. జూలు విదల్చండి: కేవీపీ

Congress leader KVP Praised TDP Chief Chandrababu Naidu
  • పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్క నేత కూడా మాట్లాడలేదన్న కేవీపీ
  • చంద్రబాబు అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత అని ప్రశంస
  • గత ఎన్నికల్లో ఓడిపోయారన్న కారణంతో ఆయనను కించపరచొద్దని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచించారన్న కేవీపీ 
  • చంద్రబాబు తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలని పిలుపు
చంద్రబాబు శక్తి సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందని, ఆయన జూలు విదిల్చి తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చి ప్రతిపక్షాల ఉద్యమంలోకి రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై పార్లమెంటు వేటు వేసిన నేపథ్యంలో విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న విషయాలకే రాష్ట్ర నేతలు వీధినపడి కొట్టుకుంటున్నారన్న ఆయన.. రాహుల్ గాంధీపై అక్రమంగా కేసు పెట్టి ఇబ్బంది పెడుతుంటే ఏపీ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి, ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా ఖండించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటులోనే హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కూడా మాట్లాడలేదని అన్నారు. 

అత్యంత గౌరవం ఉన్న ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉన్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించిన కేవీపీ.. 1984లో నాదెండ్ల భాస్కరరావు సంక్షోభ సమయంలో చంద్రబాబు చేసిన పోరాటాన్ని ఎవరూ మర్చిపోలేరన్నారు. 2018లో ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారన్న కారణంతో ఆయనను కించపరచొద్దని కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచించారని కేవీపీ తెలిపారు.

రాహుల్ గాంధీపై కేసు గురించి రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన కేవీపీ.. అధికార పార్టీకి బోల్డంతమంది ఎంపీలున్నా.. ప్రత్యేక పరిస్థితుల కారణంగా వారు మౌనం దాల్చారని అన్నారు. మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సంగతేంటని ప్రశ్నించారు. చంద్రబాబు మౌనం సరేనని, ప్రశ్నించడం కోసమే పుట్టిన జనసేన అధినేత పవన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సరైన కారణానికి సంఘీభావం తెలపకుంటే భవిష్యత్తులో ఆ హక్కును కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది వైసీపీ, టీడీపీ, జనసేనకు కూడా వర్తిస్తుందని కేవీపీ అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
KVP
Congress
K. V. P. Ramachandra Rao

More Telugu News