Groom: ఫుల్లుగా మందుకొట్టి.. మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు!

  • బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘటన
  • మద్యం మత్తులో రాత్రంతా మునిగి తేలిన వరుడు
  • అతడి కోసం ఎదురుచూసీచూసీ విసిగిపోయిన వధువు
  • పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ.. పెళ్లి రద్దు 
groom forgot to go to his wedding in Bhagalpur Bihar

ఫుల్లుగా మందుకొట్టిన వరుడు మండపానికి వెళ్లడం మర్చిపోయాడు. అతడు వస్తాడని, తన మెడలో మూడు ముళ్లు వేస్తాడని ఎదురుచూసిన వధువు చివరికి వివాహాన్ని రద్దు చేసుకుంది. బీహార్‌లోని భాగల్‌పూర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మియాన్‌ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. సోమవారం రాత్రి వివాహం జరగాల్సి ఉంది.

తన పెళ్లినే మర్చిపోయిన వరుడు
వధువు తరపు వారు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. చుట్టాలు పక్కాలు చేరుకున్నారు. బంధుమిత్రులతో పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. అయితే, ముహూర్తం దగ్గరపడుతున్నా వరుడి జాడ లేకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. మరోవైపు, మద్యం మత్తులో మునిగిపోయిన వరుడు తనకు పెళ్లన్న విషయాన్ని మర్చిపోయాడు. వరుడి కోసం ఎదురుచూసిచూసీ విసిగిపోయిన వధువు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వరుడిని బంధించిన వధువు కుటుంబం
మరోవైపు, రాత్రంతా మద్యం మత్తులో మునిగిన వరుడు మియాన్‌కు తెల్లారాక తన పెళ్లి విషయం గుర్తొచ్చింది. వెంటనే ఆగమేఘాల మీద వధువు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అతడి మీద ఆగ్రహంతో ఉన్న వధువు అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. అంతేకాదు, మియాన్‌ను, అతడితో వచ్చిన వారిని పట్టుకుని బంధించి పెళ్లి కోసం చేసిన ఖర్చు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు వారి మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నించినప్పటికీ, ఇరువర్గాలు పెళ్లికి సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారు. 

More Telugu News