Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం.. కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత

  • 2005లో రొమ్ము కేన్సర్ బారినపడిన కమిన్స్ తల్లి మరియా
  • ఇటీవలి కాలంలో తీవ్ర అనారోగ్యం
  • చికిత్స పొందుతూ కన్నుమూత
  • సంతాపం తెలిపిన ఆస్ట్రేలియా, భారత్ బోర్డులు
  • సంతాప సూచకంగా నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి ఆసీస్ ఆటగాళ్లు
Australia Captain Pat Cummins Mother Maria Passed Away

ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా కమిన్స్ ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌లో ఉన్న పాట్ కమిన్స్.. తల్లి అనారోగ్యం కారణంగా రెండో టెస్టు ముగిసిన వెంటనే స్వదేశానికి వెళ్లాడు. మూడో టెస్టు నాటికి కమిన్స్ తిరిగి వస్తాడని భావించినప్పటికీ తల్లి ఆరోగ్యం విషమంగా ఉండడంతో అక్కడే ఉండిపోయాడు. 

కమిన్స్ తల్లి మరియా మృతికి క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం తెలిపింది. ఆమె మృతికి సంతాపంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండోరోజు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు తగిలించుకుని మైదానంలోకి వచ్చారు. కమిన్స్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా మరియా మృతికి సంతాపం తెలిపింది. కమిన్స్ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్టు పేర్కొంది.

కమిన్స్ తల్లి 2005లో రొమ్ము కేన్సర్ బారినపడ్డారు. ఇటీవలి కాలంలో ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో రెండో టెస్టు ముగిసిన వెంటనే కమిన్స్ తల్లిని దగ్గరుండి చూసుకునేందుకు వెళ్లాడు. దీంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

More Telugu News