chennai: చెన్నై లోకల్ ట్రైన్ లో గొడవ.. కత్తులతో దాడి చేసుకున్న విద్యార్థులు

  • ఆరుగురు స్టూడెంట్లకు తీవ్ర గాయాలు
  • చైన్ లాగి రైలు ఆపేసి మరీ బీభత్సం
  • ప్రయాణికుల్లో భయాందోళనలు
students fight in chennai local train

వేర్వేరు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య చిన్నగా మొదలైన వివాదం కత్తులతో దాడిచేసుకునే దాకా పోయింది.. చెన్నై లోకల్ ట్రైన్ లో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. తోటి ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని చెన్నై నుంచి సూళ్లూరుకు వెళ్తున్న లోకల్ ట్రైన్ లో కొందరు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రెండు వేర్వేరు కాలేజీ విద్యార్థుల మధ్య చిన్న వివాదం మొదలైంది. సిటీలో తమదే గొప్ప కాలేజీ అంటే తమదే గొప్పదని వారు వాదించుకున్నారు.

క్రమంగా వాదన పెరిగి పరస్పరం తిట్టుకున్నారు. ఆపై కోపం పట్టలేక ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చైన్ లాగి ట్రైన్ ను ఆపేసి మరీ గొడవపడ్డారు. కొంతమంది కత్తులు, కంకర రాళ్ళతో దాడి చేయడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ గొడవతో ట్రైన్ లోని మిగతా ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి మిగతా విద్యార్థులు పారిపోయారు. గాయపడిన విద్యార్థులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవపై కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు.

More Telugu News