TSRTC: వచ్చేస్తున్నాయ్.. టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు.. వీడియో ఇదిగో!

TSRTC To introduce new sleeper buses to neighboring states
  • బస్సులో 30 బెర్తులు
  • వై-ఫై సౌకర్యం.. సీసీ కెమెరాలు కూడా
  • అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించగలిగే ఫైర్ డిటెక్షన్ సిస్టం ఏర్పాటు
  • మార్చి నుంచి అందుబాటులోకి 16 బస్సులు
  • విశాఖ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హుబ్బళ్లి నగరాలకు నడవనున్న బస్సులు
హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది శుభవార్తే. టీఎస్ఆర్టీసీ తొలిసారి 16 అత్యాధునిక బస్సులను మార్చి నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. అత్యాధునిక సదుపాయాలున్న ఓ నమూనా బస్సు నిన్న హైదరాబాద్‌లోని బస్ భవన్‌కు చేరుకుంది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆపరేషన్స్ ఈడీ పీవీ మునిశేఖర్ ఈ బస్సును పరిశీలించారు. ఈ బస్సులకు లహరి అని పేరు పెట్టారు. మార్చి నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్లీపర్ బస్సులను విశాఖపట్టణం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హుబ్బళ్లి నగరాలకు నడిపించనున్నారు. కాగా, టీఎస్ఆర్టీసీ ఇటీవల నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తి స్లీపర్ బస్సులను తీసుకొస్తోంది.

లహరి స్లీపర్ బస్సు ప్రత్యేకతలివే..
12 మీటర్ల పొడవుండే బస్సులో కింద 15, పైన 15 చొప్పున మొత్తం 30 బెర్తులు ఉంటాయి.  ప్రతి బెర్త్‌కు సెల్‌ఫోన్ చార్జింగ్ సదుపాయం, వాటర్ బాటిల్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. అలాగే, వెహికిల్ ట్రాకింగ్  సిస్టంతోపాటు పానిక్ బటన్ కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో దీనిని వినియోగించవచ్చు. బస్సులో వై-ఫై సదుపాయం, భద్రత కోసం రెండు సీసీ కెమెరాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలను  ముందే గుర్తించగలిగే ఫైర్ డిటెక్షన్ సిస్టం కూడా ఈ బస్సుల్లో ఉంటుంది.

More Telugu News

TSRTC
Sleeper Buses
VC Sajjanar