Farmer: న్యాయం కోసం లంచం ఇవ్వలేను.. ఇందిరా పార్క్ వద్ద ఓ రైతు నిరసన

  • తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమి కాజేశారని ఆరోపణ
  • తన భూమిని తమ్ముడికి కట్టబెట్టారని బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు
  • వరంగల్ జిల్లా పొనకల్ గ్రామానికి చెందిన రైతు ఆందోళన
Farmer protest at indira chowk in hyderabad

నకిలీ పత్రాలు సృష్టించి తన భూమిని కాజేశారంటూ వరంగల్ జిల్లా పొనకల్ కు చెందిన రైతు గట్ల సురేందర్ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్నాడు. ఇందిరా పార్క్ వద్ద భుజాన నాగలి పెట్టుకుని, న్యాయం కోసం లంచం ఇవ్వలేనంటూ ఓ బ్యానర్ తో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమిని తప్పుడు పత్రాలతో తన తమ్ముడికి కట్టబెట్టారని, పొనకల్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులే ఈ పని చేశారని ఆరోపించాడు.

ఇందిరా పార్క్ నుంచి అర్ధనగ్నంగా, భుజాన నాగలి, చేతిలో ఉరితాడుతో గట్ల సురేందర్ నడుచుకుంటూ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నాడు. పోలీసులను ఉన్నతాధికారులను కలిసినా తనకు న్యాయం జరగలేదని సురేందర్ చెప్పాడు. వారు చూపిస్తున్న ఒరిజినల్ పేపర్లను పరిశీలించాలని డీజీపీని కోరారు. ఆ పత్రాలు సరైనవైతే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఉరి తీయాలని అన్నాడు.

ఈ విషయంలో గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. అయితే, డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసేందుకు సురేందర్ ప్రయత్నించగా.. పోలీసులు అతడిని డీజీపీ కార్యాలయంలోకి అనుమతించలేదు.

More Telugu News