Ayyanna Patrudu: టెంకాయ కొట్టడానికి కూడా వంగలేని జగన్.. చంద్రబాబును అంటాడా?: అయ్యన్నపాత్రుడు

  • కడప స్టీల్ ప్లాంటుకు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారని అయ్యన్న ఎద్దేవా
  • వివేకా హత్య కేసులో విజయసాయిని సీబీఐ విచారించాలి
  • రాజధాని విషయంలో జగన్ వి తుగ్లక్ నిర్ణయాలని విమర్శ
Ayyanna Patrudu fires on Jagan

కడప స్టీల్ ప్లాంట్ కు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారంటూ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. టెంకాయ కొట్టడానికి కూడా వంగలేని నీవు... చంద్రబాబును ముసలోడు అంటావా? అని మండిపడ్డారు. మంత్రి రోజా సంస్కారం లేని వ్యక్తి అని... అలాంటి వారి గురించి మాట్లాడి విలువ తగ్గించుకోమని చెప్పారు. జగన్ డైరెక్షన్ లోనే వైయస్ వివేకా హత్య జరిగిందని... ఎంపీ టికెట్టే ఈ హత్యకు కారణమని ఆరోపించారు. 

వివేకా హత్యను ఆనాడు చంద్రబాబుకు ఆపాదించారని... అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును మాఫీ చేయాలని చూశారని విమర్శించారు. సీబీఐ విచారణలో నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. రక్తపు మడుగులో వివేకా ఉంటే... గుండెపోటు అని విజయసాయిరెడ్డి ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఈ హత్య కేసులో విజయసాయిరెడ్డిని కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. కోడికత్తి కేసులో నాలుగేళ్లు గడిచినా విచారణ కొనసాగుతూనే ఉందని అన్నారు. 

రాజధాని విషయంలో జగన్ వి తుగ్లక్ నిర్ణయాలని విమర్శించారు. ఏపీకి ముఖ్యమంత్రి జగనా? లేక సజ్జలా? అనే సందేహం కలుగుతోందని అన్నారు. ఏ చట్టం ప్రకారం విశాఖను రాజధానిగా పెడతారని ప్రశ్నించారు. ఏపీని సర్వనాశనం చేసిన జగన్... దేశ వ్యాప్తంగా రాష్ట్రం పరువు తీశారని అన్నారు. విజయసాయిరెడ్డి రూ. 40 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. జగన్ పాలనపై ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని... లేకపోతే మీ పిల్లలకు భవిష్యత్తు ఉండదని అన్నారు. 

More Telugu News