Jai Singh: 10 నిమిషాల్లో 3 క్వార్టర్లు తాగుతానని పందెం కాసి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు!

  • ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఘటన
  • మిత్రుల పందెం ప్రాణాంతకం అయిన వైనం
  • అధిక మోతాదులో మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తి
Man dies of liquor over dose in Agra

మద్యం మితిమీరితే అనర్థదాయకం అని తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగుతానని పందెం వేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి పేరు జై సింగ్. వయసు 45 ఏళ్లు. ఆగ్రాలో ఈ-రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మిత్రుల పందెం అతడి పాలిట ప్రాణాంతకం అయింది. 

3 చీప్ లిక్కర్ బాటిళ్లను 10 నిమిషాల్లో తాగగలవా? అంటూ అతని ఇద్దరి స్నేహితులు భోలా, కేశవ్ సవాల్ విసిరారు. ఒకవేళ మద్యం తాగలేకపోతే, మిత్రులు ఎంత తాగుతారో అంత మొత్తానికి తానే బిల్లు చెల్లిస్తానని పందానికి అంగీకరించాడు. అనంతరం, వెనుకా ముందూ ఆలోచించకుండా మూడు క్వార్టర్ల మద్యం గడగడా తాగేశాడు. దాంతో అపస్మారక స్థితిలో రోడ్డుపక్కన పడిపోయాడు. 

అతడిని కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. చివరికి ఎస్ఎన్ మెడికల్ కాలేజీ వద్దకు తీసుకువచ్చేసరికి, అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. 

కాగా, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జై సింగ్ ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు. మృతి చెందిన జై సింగ్ కు నలుగురు మైనర్ సంతానం ఉన్నారు.

More Telugu News