Delhi: ఢిల్లీలో స్టార్ హోటల్ కు రూ. 23 లక్షల బిల్లు ఎగ్గొట్టి, ఉడాయించిన ఘరానా మోసగాడు

  • ఢిల్లీలోని లీలా మహల్ ప్యాలెస్ కు భారీ టోకరా
  • అబుదాబి రాయల్ ఫ్యామిలీకి క్లోజ్ అని చెప్పుకున్న వ్యక్తి
  • నాలుగు నెలల పాటు హోటల్ లో బస చేసిన వైనం
Man Flees Delhi 5 Star Hotel Leaving 23 Lakh Bill

ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లీలా మహల్ ప్యాలెస్ లో ఒక వ్యక్తి దాదాపు నాలుగు నెలల పాటు బస చేసి సుమారు రూ. 23 లక్షల బిల్లును ఎగ్గొట్టి దర్జాగా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 20 వరకు మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి లీలా మహల్ ప్యాలెస్ లో బస చేశాడు. 

యూఏఈ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఫేక్ బిజినెస్ కార్డును ఉపయోగించాడు. అబుదాబి రాయల్ ఫ్యామిలీ షేక్ ఫలాహ్ బిన్ జయేద్ అల్ సహయన్ కు అత్యంత క్లోజ్ గా పని చేశానని చెప్పాడు. ఫేక్ బిజినెస్ కార్డు, ఇతర డాక్యుమెంట్లను చూపించాడు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత హోటల్ సిబ్బందితో మాట్లాడుతూ వారిని దగ్గర చేసుకున్నాడు. 

నాలుగు నెలల్లో ఆయన బిల్లు రూ 35 లక్షలు అయింది. రూ. 11.5 లక్షలు చెల్లించి... మిగిలిన మొత్తానికి నవంబర్ 20న చెల్లని చెక్కును ఇచ్చి జంప్ అయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను ఇచ్చిన డాక్యుమెంట్లు, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అతన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హోటల్ లో పలు వెండి వస్తువులను కూడా అతను దొంగిలించినట్టు సమాచారం.

More Telugu News