Bonda Uma: పొరుగు రాష్ట్ర మంత్రి దావోస్ లో ఉంటే.. ఏపీ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడు: బొండా ఉమ

Why AP Govt not went to Davos asks Bonda Uma
షార్ట్స్‌లో చూడండి
తన విధ్వంసకరపాలన, అంతులేని అవినీతి, అడ్డూ ఆపులేని దోపిడీ, అన్నింటికంటే గొప్పదైన తన ముఖారవిందం చూసి ఏపీకి పరిశ్రమలు రావని, పారిశ్రామికవేత్తలెవరూ పైసా పెట్టుబడి పెట్టరని జగన్ రెడ్డికి అర్థమైందని, అందుకే ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వం పాల్గొనలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

“చంద్రబాబునాయుడి పాలనలో రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా, పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా ఉండేది. దావోస్ వేదిక మొదలు, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక, పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు చేసుకున్న రూ.16 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాల్ని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే దుర్మార్గంగా రద్దు చేశాడు. 

జగన్ అహంకారపూరిత నిర్ణయం, ప్రతి పారిశ్రామికవేత్తలను ఆలోచించుకునేలా చేసింది. దానిప్రభావమే నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ రాకపోవడం' అని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5,17,000 కోట్ల పెట్టబడులు వచ్చాయన్న మేకపాటి గౌతమ్ రెడ్డి సమాధానంపై జగన్ రెడ్డి ఏం చెబుతాడు? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్ర మంత్రి (కేటీఆర్) దావోస్ లో పెట్టుబడులను ఆకర్షిస్తుంటే... ఏపీ మంత్రి విశాఖలో కోడిపందేలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రానికి పైసా పెట్టుబడి తీసుకురావాలన్న ఆలోచన, పది మందికి ఉపాధి కల్పించాలన్న సద్భుద్ధి జగన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి లేదని బొండా ఉమా విమర్శించారు. దావోస్ సదస్సులో ఏపీ ప్రాతినిధ్యం ఎందుకు లేదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్నిరాష్ట్రాలు పరిశ్రమల్ని ఆహ్వానించడానికి పడరానిపాట్లు పడుతుంటే, జగన్ రెడ్డికి అసలు వెళ్లాలన్న ఆలోచనే రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. 

అన్నిరాష్ట్రాల పాలకులు దావోస్ వేదికపై తమ స్వరాలు వినిపిస్తున్నవేళ, జగన్ రెడ్డి తాడేపల్లిలో చిందులేస్తుంటే, పరిశ్రమల మంత్రి విశాఖపట్నంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడని... సొంత పార్టీవారు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల్ని కమీషన్ల కోసం వేధిస్తుంటే, ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడని మండిపడ్డారు. ఏపీ యువత బూమ్ బూమ్ బీర్లు అమ్ముతూ, మాంసం కొట్టుకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే జగన్ రెడ్డి ఆలోచనా? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Bonda Uma
Telugudesam
Davos
Jagan
YSRCP
KTR
TRS

More Telugu News